welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Thursday, July 12, 2012

మన దేవుళ్ళకు తెలుగు రాదా? పులికొండ సుబ్బాచారి వ్యాసం (సూర్య 9.4.2012)

 


మన దేవుళ్ళకు తెలుగు రాదా?

దేవాలయంలో కాని ఇంటి వద్ద కాని చేసే యజ్ఞయాగాదులన్నింటా చేసేది మనం అయినా చేయించే పూజారి చదివేది మనకు తెలియని సంస్కృత భాషే. దీనికి బదులు మనం ఇదే విషయాన్ని తెలుగులో మనమే చెప్పకూడదా. చివరికి సంకల్పం చెప్పే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే, కృష్ణా గోదావరీయో ర్మధ్యదేశే అస్మద్‌ గృహే పత్నీ సహితం అని వగైరా మన ఇంట్లో మనం, అంటే నేను వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనం చెప్పే మాటల్ని పూజారి దేవునికి సంస్కృతంలో వినిపిస్తాడు.ఇలాంటి సంకల్పాన్ని చక్కగా మనకై మనం తెలుగులో నేను ఫలానా పేరు కలిగిన వ్యక్తిని భరతవర్షంలో భరత ఖండంలో మేరు పర్వతానికి దక్షిణ దిక్కున కృష్ణాగోదావరీ నదుల మధ్యభాగంలో ఉన్న తెలుగు నేలలో ఫలానా ఊరిలో కుటుంబ క్షేమాన్ని కోరి వ్రతం చేస్తున్నాను దేవా అని దేవునికి తెలుగులో మనం చెప్పుకోలేమా అన్నది ప్రశ్న.

ఇక్కడ పవిత్రత సంస్కృత భాషని బట్టి వస్తుందా లేదా చేసే మనసును బట్టి వస్తుందా అన్నది మనం ఆలోచించాలి.మన దేవుళ్ళు ఏ భాషలో మాట్లాడారో మనకు తెలి యదు. తెలుసు అని అనుకుని చెప్పేవాళ్ళు మా త్రం దేవుళ్ళు సంస్కృతంలో మాట్లాడుకుంటారు అని చెబుతారు. అందుకే దీన్ని దేవభాష అనీ అంటుంటారు అంతే కాదు దీన్ని గీర్వాణభాష అని గీర్వాణంగా చెబుతారు. కాని దేవుళ్ళు మాట్లాడగా విని చెప్పిన వారు తటస్థిస్తే దీన్ని నిక్క చ్చిగా నమ్మే వీలుంది. దేవుళ్ళలో కూడా జండర్‌ వివక్ష చాలా ఉందని చెప్పడానికి వీలుంది. మన సంస్కృత నాటకాల్లో పురుష దేవతలు అందరూ సంస్కృతంలో సంభాషిస్తూండగా సేవకులు పరిచార కులు వంటి అథమ పాత్రలు, స్ర్తీ దేవతలు మాత్రం సమాజంలో తక్కువగా భావించిన ప్రాకృత భాషలో మాట్లాడతాయి.

ఇదంతా మన సంస్కృత నాటకకారుల చేతిచలువే కాని దేవతా స్ర్తీలు ఏ భాషలో మాట్లాడారో వారికేం తెలుసు అని మన ఫెమినిస్టు వీరనా రీమణులు అడిగే అవకాశమూ లేకపోలేదు. నిజానికి దేవుళ్ళు ఏభాషలో మాట్లాడినా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాని మనం మాట్లాడే తెలుగు వారికి అర్థం కాదట. దీనితోనే మన కు ఇబ్బంది వచ్చింది.
ప్రతి మనిషి తాను పుట్టిన ఇంట్లో తల్లి తండ్రి కుటుంబ సభ్యులతో నేర్చుకునే భాష ఒకటి ఉంటుంది. దాన్నే మాతృభాష అని అంటారు. నిజానికి ఇది కుటుంబ భాష. వ్యక్తి పెరిగి విద్యావంతుడు అవుతూ ఇతర భాషలు నేర్చు కుంటాడు. తన సామాజిక అవస రాలకు ఏ భాష అవసర మో దానిలో అతను పని చేసుకుంటాడు. తన దైనందిన జీ వితపు అవస రాలకు తన భాషే విని యోగప డాలని ప్రతి భాషీ యుడు కోరుకుం టాడు. అలా వీలుపడని సందర్భాలలో ఆ సందర్భా నికి అవసరమైన భాష లో పని చేసుకోవలసి ఉంటుంది.

ప్రతి భాషకు సంబంధించిన వారికి, ప్రతి సంస్కృతిలోని వారికీ సామా జిక సందర్భాలతో పాటు మత సందర్భాలూ ఉంటాయి. అంటే దేవునితో సంబంధం ఉన్న సందర్భాలు అని కూడా వీటిని చెప్పవచ్చు. ప్రతి సంస్కృ తిలో జానపదులలో గిరిజన తెగలలోను ఈ మత సందర్భాలలో దేవునికి మనిషికి మధ్యన మరొక మనిషి ఉంటాడు. ఇతడినే పూజారి అని ఆచార మంతుడు అని, ముజావర్‌ అని పాస్టర్‌ అని ఒక్కొక్క మతంలో ఒక్కో సం స్కృతిలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ మధ్యవర్తి మన తరఫున దేవునితో మాట్లాడుతుంటాడు.

ప్రతి సంస్కృతిలోను దేవునితో మాట్లాడే భాష దేవుడు మాట్లాడే భాష వేరుగా ఉంటాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే చాలా మత గ్రంథాలు సామాన్య మానవు లు మాట్లాడే భాషలో లేవు. అంతే కాదు మత సంబంధమైన దైవ సంబం ధమైన కార్యక్రమాలు అన్నీ అందరికీ అర్థంకాని భాషలో ఉంటాయి. ఒక తరహా భాషకు మతగౌరవం లభించిన తర్వాత ఆ భాష అర్థంకాకపోయినా ఫర్వాలేదు అనే భావన ఆ భాషీయులలో కలగడం అన్ని చోట్లా గమనించవచ్చు. అందుకే వీటిని రిచ్యువల్‌ లాంగ్వేజస్‌ అని అంటారు. అంటే ఇక్కడ పావిత్య్రం అనే భావన భాషతో ఉందే కాని భావంతో ప్రధానంగా కాదని. ప్రస్తుతం ఈ విషయాన్ని తెలుగు నేలపై లేదా ఆంధ్ర ప్రదేశ్‌ విషయంలో ఏం జరుగుతుందో గమనించి మంచి చెడు ఆలోచన చేద్దాం. ఆంధ్ర దేశంలో ఎక్కువ శాతం ప్రజలలో అంటే చాలా కులాల వారికి మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించేది బ్రాహ్మణ కులానికి చెందిన పూజారులు.

లైఫ్‌ సైకిల్‌ రిచ్యువల్స్‌ వీటినే జీవన చక్ర సంబరాలు అని అంటారు. అంటే మనిషి పుట్టి నప్పుడు చేసే ఆచారం దగ్గరనుండి ఉపనయనం, రజస్వల, పెండ్లి, గర్భాదానం తిరిగి పుట్టుక అంటే బారసాల మరణం వీటన్నింటి సందర్భాలలో పూజారి ఉండి మనతో ఆయన పూజ చేయించ వలసి ఉంటుంది. మన తరఫున దేవునికి ఆయన మంత్రాలు చదువుతాడు. అంతే కాదు చాలా ఇతర సందర్భాలలో అంటే గృహప్రవేశం, సత్యనా రాయణస్వామి వ్రతాలు వంటి చాలా వ్రతాలలోను ఇలాంటి ఇతర మత సందర్భాల లోను పూజారి లేకుండా పనులు జరగవు. ఇక గుడికి పోతే మనం చేసే అష్టోత్తరం సహస్రనామం, అర్చనలు వంటి అన్ని సేవలు మన తరఫున పూజారి చేస్తాడు. తెలు గు నేలమీద తెలుగు వారి ఇండ్లలో, గుడులలోను జరిగే ఈ అన్ని కార్య క్రమాలలో ను పూజారి చదివే మంత్రాలు పూజలు అన్నీ అటు పూజారికీ ఇటు చేయించుకునే వారికి తెలిసిన తెలుగు భాషలో జరగవు. ఇవి అన్నీ సంస్కృత భాషలో జరుగుతాయి.

దేవునికి ఘంటానాదం సమర్పయామి, మధ్యమధ్యే పానీయం సమర్పయామి, దీపం దర్శయామి, ధూపమాఘ్రాపయామి, నాట్యం దర్శయామి అని మనం చేసే సేవలు అన్నింటికీ మన తరఫున పూజారి మనకు తెలియని సంస్కృతభాషలో చదువు తాడు. దేవాలయంలో కాని ఇంటి వద్ద కాని చేసే యజ్ఞయాగాదులన్నింటా చేసేది మనం అయినా చేయించే పూజారి చదివేది మనకు తెలియని సంస్కృత భాషే. దీనికి బదులు మనం ఇదే విషయాన్ని తెలుగులో మనమే చెప్పకూడదా. చివరికి సంకల్పం చెప్పే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే, కృష్ణా గోదావరీయోర్మధ్యదేశే అస్మద్‌ గృహే పత్నీ సహితం అని వగైరా మన ఇంట్లో మనం, అంటే నేను వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనం చెప్పే మాటల్ని పూజారి దేవునికి సంస్కృతంలో వినిపిస్తా డు. ఇలాంటి సంకల్పాన్ని చక్కగా మనకై మనం తెలుగులో నేను ఫలానా పేరు కలి గిన వ్యక్తిని భరతవర్షంలో భరతఖండంలో మేరు పర్వతానికి దక్షిణ దిక్కున కృష్ణా గోదావరీ నదుల మధ్యభాగంలో ఉన్న తెలుగు నేలలో ఫలానా ఊరిలో కుటుంబ క్షేమాన్నికోరి వ్రతం చేస్తున్నాను దేవా అని దేవునికి తెలుగులో మనం చెప్పుకోలేమా అన్నది ప్రశ్న. ఇక్కడ పవిత్రత సంస్కృత భాషని బట్టి వస్తుందా లేదా చేసే మనసు ను బట్టి వస్తుందా అన్నది మనం ఆలోచించాలి.

అంతే కాదు పెళ్ళి సందర్భంలో వరుడుతో తాళి కట్టే ముందు పూజారి ఒక మంత్రం అనిపిస్తాడు. మాంగల్యంతంతునానేనా మమ జీవన హేతునాం కంఠే బధ్నా మి శుభగే సంజీవ శరదాం శతం అని. నోరు తిరిగినా తిరగకపోయినా పెళ్ళికొడుకు దాన్ని చెప్పి తర్వాత ఆమె మెడలో మాంగల్యాన్ని కడతాడు. ఇది పూజారికి అర్థం అయితే కావచ్చుగాక కాని తాళికట్టే పెండ్లి కొడుకులకు దీని అర్థం నూటికి తొంభై తొమ్మిదిమందికి అర్థంకాదు. కట్టించుకునే పెండ్లి కూతు రుకీ అర్థంకాదు, చుట్టూ ఉన్న బంధుమిత్రులకూ అర్థంకాదు. ఇంత బాధ ఎందుకు పెండ్లి కొడుకుతో నేను నూరేండ్లు హాయిగా ఈమెతో కలిసి జీవించడానికి గాను ఈమె కంఠంలో మాంగల్యా న్ని కడుతున్నాను అని చక్కగా తెలుగు లో చెప్పి కట్టవచ్చుగా. మిగతా ప్రమాణాలు అన్నీ కూడా ఇలా తెలు గులో చేస్తే చాలా హాయిగా ఉండదా.

కాని పెండ్లివేళ అక్కడికి ఆవాహన చేసిన దేవుళ్ళకి ఈ తెలుగు అర్థంకాదట. దేవుళ్ళకి అలా సంస్కృతం మం త్రాలలోనే చదివితేనే పవిత్రమైనదని వారికి తెలుస్తుందని ఒక పూజారిగారు సెలవి చ్చారు. అంతే కాదు అలా మంత్రాలని తెలుగులో చదివి చెప్పడాన్ని పెళ్ళి చేయించు కునే ప్రజలు ఎవరూ అంగీకరించేలా కూడా లేరు. వారికి కూడా సంస్కృతం మంత్రా లు చదివితేనే తృప్తి అక్కడికి అది పవిత్రమౌతుందని భావం కలుగుతుంది. గుడిలో జరిగే విషయంలోను ఇదే జరుగు తుంది. కాని ఒకప్పుడు కవి రాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పెండ్లిండ్లు అన్నీ తెలుగులో చేయవచ్చని, చేయాలని ఒక ఉద్యమంగా గ్రహించి చేపట్టారని చాలా సందర్భాలలో అలా చేయించారని పెద్ద వాళ్లు చెప్పగా విన్నాను. పెండ్లి మంత్రాలన్నీ తానే చదివి దేవునికి అప్పగిస్తే పెండ్లి కొడు కు ఊరక అతను చెప్పినవన్నీ చేస్తే ఆమె ఎవరి భార్య అవుతుం ది అనే తీవ్రమైన ప్రశ్నలు కూడా లేవనెత్తాడు వెనిగళ్ళ సుబ్బా రావు పెండ్లి మంత్రాల వెనుక బండారం అనే పుస్తకంలో.
కాని పరిస్థితి దేశం అంతటా ఇలా లేదు.

చాలా గ్రామ దేవతల గుడులలో, పేరం టాళ్ళ దేవతల గుడులలో వెనుకబడిన వర్గాలకు చెందినవారు, దళితులు పూజారులు గా ఉన్నారు. అక్కడ జరిగే ఆచారాలన్నింటి లో తెలుగులోనే పూజా కార్య క్రమాలు జర గడం గమనించవచ్చు. చాలా గ్రామ దేవ తల గుడులలో రజకులు, క్షురక వృత్తి వా రు పూజారులుగా ఉన్నారు. అలాగే కొమ్ములవాళ్ళు, బైండ్లవాళ్ళు వంటి దళితులు పూ జలు చేసే గుడులు, జాతరలు కొన్ని ఉన్నా యి. వాటిలో ఈ కులాల పూజారులు వారి మంత్రాలను ఆచారాలను తెలుగులోనే చేస్తారు. కొన్ని సందర్భాలలో వినపడకుం డా చదవడం కూడా ఉంది. దీన్నిబట్టి పవిత్ర కార్యక్రమాలు తెలుగులో చేసుకోవచ్చు అని ఒక నిరూపణ మనకు ఉండనే ఉంది.

చాలా మంది గిరిజనులు వారి దేవతల పూజల్ని వారి భాషలోనే చేసుకోవడం ఉం ది. ఇన్ని ఉండగా నూటికి ఎనభై మంది పై గా ఉన్న తెలుగు వారు అటు గుడు లలోను ఇటు ఇండ్లలో జరిగే మత కార్యక్రమాలలో ను ఎరికీ తెలియని సంస్కృత భాషను ఎం దుకు వాడాలి మనకు తెలిసిన తెలుగులోనే మనం చేసుకోకూడదా. నిజానికి మనం మ న దేవునికోసం మనమే చేసే పూజకు మధ్య వర్తి ఉండి మనకు తెలియని భాషలో చదవ డం అవసరమా. ఇవి మౌలికమైన ప్రశ్నలు. ఇవి విశ్వాసానికి మాత్రమే సంబంధించిన వి కావు. అసలు దేవుని దృష్టిలో మనుషుల మధ్య తారతమ్యాలు లేనట్లే భాషల మధ్య కూడా ఉండవు. అది నిజంగా దేవుడే అయితే అసలు ఉండడానికి వీలులేదు. మన దేవుళ్లకు తెలుగు రాదా అని ప్రశ్న వేసు కుంటే రాదు అని చెప్పగలిగే తెలుగువారు ఉన్నారా. రాదు అని చెప్పలేనప్పుడు మన తెలుగుకు మతసంస్కార స్థాయిని కల్పించి గుడిలో ఇంట్లో అన్ని మతకార్యా లకు తెలుగే ఎందుకు వాడకూడదు అని ప్రశ్న వేసు కుందాం.

ఈ విషయంలో క్రిస్టియన్లు కొంత మెరుగు అనిపిస్తుంది వారు మత ప్రచారం చేయడానికి తమ లక్ష్యంగా ఎవరు ఉన్నారో వారి భాషలోనే ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారు. క్రీస్తు భాష అని హీబ్రూ భాషలో చేయరు. కాని వారి తెలుగు విషయంలోను తకరారు ఉంది. వారు ఒక ప్రత్యేకమైన తెలుగును కృతకమైన దాన్ని అభివృద్ధిపరిచారు. వారి మతప్రచారకు లకు మామూలుగా అందరికీ అర్థమయ్యే తెలుగు వచ్చినా దానిలో మాట్లాడరు. వారి కృతక తెలుగులోనే మాట్లాడతారు. ఆ తెలుగుకు మత స్థాయి వచ్చింది.
బడుల్లో తెలుగు పరిస్థితి దీనాతిదీనంగా ఉందనే విషయం మొన్న విశాఖ పట్నం లో జరిగిన సంఘటన. అధికారభాష అమలుకూడా ప్రభుత్వం చేతిలో ఉంది. దాని కోసం ఉద్యమం చేయాల్సిందే. కాని మన ఇండ్లలో చేసే పూజల్లోను గుడుల్లో చేసే పూజల్లోను మనకు మనమే దేవునికి మనకు తెలిసిన మన తెలుగులో చేసుకోలేమా అని ప్రశ్నించుకొని ఆచరిస్తే మన తెలుగుకు మతసంస్కార స్థాయిని, పవిత్ర స్థాయిని తెచ్చుకోవడం మన చేతల్లోనే ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఉద్యమం చేసైనా తెలుగుకు మతపవిత్రస్థాయికూడా తెచ్చుకోవాలి. నాకు తెలుగు అర్థం కాదు అనే దేవుడు ఉంటాడని దేవుడిని నమ్మేవాళ్ళు ఎవరైనా అంటారా. చూద్దాం వేచి చూద్దాం.--( వ్యావహారికభాషా మార్గదర్శి గురజాడ 150 జయంతి సం పురస్కరించుకొని) (సూర్య 9.4.2012)

No comments: