welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Tuesday, July 28, 2009

భారత్‌లో 13 లక్షల సఫాయి కార్మికులు చేతులతోనే మలమూత్రాదుల ఎత్తివేత

నిషేధం మాటున..అమానుష బానిసత్వం!
భారత్‌లో 13 లక్షల సఫాయి కార్మికులు
చేతులతోనే మలమూత్రాదుల ఎత్తివేత
సభ్యసమాజానికే అవమానం
చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు


న్యూఢిల్లీ: మూడో తరం ఫోన్‌లు, మునుపెన్నడూ వూహించనంతటి పలుచటి తెర టీవీలు.. ఐమాక్స్, ఐనాక్స్ సాంకేతిక పరిజ్ఞానం సినిమాలు.. ఇలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన వస్తువులు, పరిజ్ఞానం గురించి చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇంతటి అధునాతన పరిజ్ఞానం మానవ జీవితాల్లో ఉత్కృష్ఠమైన స్థానం సంపాదించుకొన్నా.. నేటికీ భారత సమాజంలో 13 లక్షల మంది సఫాయి కార్మికులు ఉన్నారు. వాస్తవానికి 16 ఏళ్ల కిందటే భారత్‌లో సఫాయి పనిని ప్రభుత్వం నిషేధించింది. అయినా.. వీరు ఇప్పటికీ చేతులను ఉపయోగించే మలమూత్రాదులను తీస్తూ.. పొట్టపోషించుకొనే దుస్థితిలో ఉన్నారు.

దేశంలో చేతులతో సఫాయి పనులు చేయించడాన్ని రెండేళ్ల కిందటే నిర్మూలించాల్సి ఉన్నప్పటికీ సాధ్యపడలేదని.. ప్రస్తుతం మార్చి 2010 కల్లా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి ముకుల్ వాస్నిక్ రాజ్యసభకు తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.15 లక్షల మంది సఫాయి కార్మికులు ఉన్నారు. వీరికోసం కేంద్రం స్వయం ఉపాధి, పునరావాస పథకాన్ని అమలు చేసింది. అయితే ఇదంతా ప్రభుత్వ లెక్కల్లోనే. ఈ విషయమై 'సఫాయి కర్మచారి' ఉపసంఘం కన్వీనర్ బి.విల్సన్ మాట్లాడుతూ.. 'ఈ లెక్కలన్నీ అవాస్తవాలు' అని స్పష్టం చేశారు. దేశంలో ఎంత మంది సఫాయి కార్మికులు ఉన్నారనే విషయమై చాలా కాలంగా జాతీయ స్థాయిలో సరైన సర్వే జరగలేదని తెలిపారు. 'నాలుగేళ్ల కిందట 9 రాష్ట్రాల్లో మేం ఓ సర్వే నిర్వహించాం. దీని ప్రకారం దేశంలో కనీసం 13 లక్షల మంది సఫాయి కార్మికులు ఉన్నట్లు అంచనాకు వచ్చాం' అని వివరించారు. దీనిపై సఫాయి కర్మచారి ఆందోళన్ 2003లో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఫలితంగా 2007 నుంచి ఈ విషయమై రాష్ట్రాలు కొన్ని చర్యలు చేపడుతున్నాయి. 1993లో కేంద్రం సఫాయి కార్మికులకు ఉపాధి, పాయిఖానా దొడ్ల(డ్రై లెట్రిన్) నిర్మాణ చట్టం రూపొందించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఏడాది జైలు, రూ.2000 జరిమానా లేక రెండూ విధించవచ్చు. దౌర్భాగ్యకరంగా ఇప్పటికీ దేశంలో అనేక మున్సిపాల్టీలు పాయిఖానా దొడ్లను నిర్వహిస్తున్నాయి. ఈ చట్టాన్ని ఉల్లంఘించడంలో భారతీయ రైల్వేలదే ప్రథమ స్థానమని విల్సన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

2007లో కేంద్రం లెక్కల ప్రకారం దేశంలో 3.24 లక్షల సఫాయి కార్మికులు ఉన్నారు. 16,386 మందితో ఒరిస్సా ఈ జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 11 రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణపత్రంలో తమ రాష్ట్రంలో 'సఫాయి కార్మికులు లేరని, ఈ వ్యవస్థను సమూలంగా నిర్మూలించామని' పేర్కొనడం గమనార్హం.

Tuesday, July 07, 2009

భారమైన బాధ్యత

భారమైన 'బాధ్యత'!

ఆన్‌లైన్, జీడిమెట్ల కాటికి కాళ్లు చాచిన ఆ తండ్రి కొడుకులకు భారమయ్యాడు. జీవిత చరమాంకంలో ఆలనా పాలనా దగ్గరుండి చూడాల్సిన కుమారులే.. బాధ్యతల నుంచి తప్పించుకున్నారు. లోకం తెలియని వయస్సు నుంచి సొంత కాళ్లపై నిలబడేందుకు అనుక్షణం తపించిన తండ్రిని భరించలేక బస్టాండ్‌లో వదిలేశారు. దారిన పోయే వారు ఇచ్చే తినుబండారాలతో కాలం గడుపుతూ చావు కోసం ఎదురుచూసేలా విషమ పరీక్ష పెట్టారు. ఓ వైపు సహకరించని శరీరం మరోవైపు చచ్చుబడిన కాళ్లు, నడవడానికి కూడా ఓపిక లేక పదిరోజులుగా నానా యాతన పడుతున్న పండు ముదుసలిని చూసి ఓ స్త్రీ మూర్తి హృదయం ద్రవించింది. తనకు తెలిసిన వృద్ధాశ్రమానికి సమాచారమిచ్చింది. నీ లాంటి వాళ్ల కోసమే మేమున్నా మంటూ ఆశ్రమవాసులు అక్కున చేర్చుకున్నారు. హృదయాలు బరువెక్కే ఈ సంఘటన కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని ఐడీపీఎల్‌లో చోటుచేసుకుంది.

పదిరోజులుగా కుత్బుల్లాపూర్ సర్కిల్‌పరిధిలోని ఐడీపీఎల్ చౌరస్తాలో ఉన్న బస్టాండ్‌లో ఓ వృద్ధుడు అచేతనంగా పడి ఉన్నాడు. రోజూ అక్కడే బస్సు ఎక్కే బాలానగర్‌కు చెందిన ఎల్ఐసీ ఉద్యోగి జ్యోతికి అతనిపై జాలేసింది. వృద్ధుడి వివరాల కోసం స్థానికులతో కలిసి ప్రయత్నించింది. తనపేరు నారాయణ అని, కన్న కొడుకులే తీసుకొవచ్చి బస్టాండ్ లో వదిలేశారని మాత్రమే చెప్పాడు. మిగతా కుటుంబ వివరాలు చెప్పడానికి నిరాకరించాడు. తనకు పరిచస్తురాలైన శ్రీదేవి దుండిగల్ సమీపంలో 'పల్లవి' వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న విషయం జ్యోతికి స్ఫురణకు వచింది. ఆదివారం సాయంత్రం ఆమెకు సమాచారమందించింది.

వెంటనే స్పందించిన శ్రీదేవి సోమవారం ఉదయం తమ ఆశ్రమ సిబ్బందితో జీడిమెట్ల పోలీసుస్టేషన్ చేరుకుని అతడిని ఆశ్రమానికి తీసుకువెళ్తున్నట్లు తెలిపింది. వారి సహాయాన్నిఅభినందించిన జీడిమెట్ల ఎస్సై ప్రవీందర్‌రావు అతడిని ఆశ్రమానికి చేర్చడానికి ప్రయాణ ఏర్పాట్లు చేశాడు. నిలబడే శక్తికూడా లేని అతడిని శ్రీదేవి ఆటోలో ఆశ్రమానికి తీసుకెళ్లింది. వృద్ధులకు సేవలందిస్తున్న శ్రీదేవిని స్థానికులు అభినందించారు. అనాథలను అక్కున చేర్చుకుని సేవలందిస్తున్న శ్రీదేవికి, సాటివారి దయనీయ స్థితిపై జాలిపడి ఆశ్రమానికి దారి చూపిన జ్యోతికి 'ఆన్‌లైన్' హ్యాట్సాఫ్ చెబుతోంది.