Tuesday, July 07, 2009

భారమైన బాధ్యత

భారమైన 'బాధ్యత'!

ఆన్‌లైన్, జీడిమెట్ల కాటికి కాళ్లు చాచిన ఆ తండ్రి కొడుకులకు భారమయ్యాడు. జీవిత చరమాంకంలో ఆలనా పాలనా దగ్గరుండి చూడాల్సిన కుమారులే.. బాధ్యతల నుంచి తప్పించుకున్నారు. లోకం తెలియని వయస్సు నుంచి సొంత కాళ్లపై నిలబడేందుకు అనుక్షణం తపించిన తండ్రిని భరించలేక బస్టాండ్‌లో వదిలేశారు. దారిన పోయే వారు ఇచ్చే తినుబండారాలతో కాలం గడుపుతూ చావు కోసం ఎదురుచూసేలా విషమ పరీక్ష పెట్టారు. ఓ వైపు సహకరించని శరీరం మరోవైపు చచ్చుబడిన కాళ్లు, నడవడానికి కూడా ఓపిక లేక పదిరోజులుగా నానా యాతన పడుతున్న పండు ముదుసలిని చూసి ఓ స్త్రీ మూర్తి హృదయం ద్రవించింది. తనకు తెలిసిన వృద్ధాశ్రమానికి సమాచారమిచ్చింది. నీ లాంటి వాళ్ల కోసమే మేమున్నా మంటూ ఆశ్రమవాసులు అక్కున చేర్చుకున్నారు. హృదయాలు బరువెక్కే ఈ సంఘటన కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని ఐడీపీఎల్‌లో చోటుచేసుకుంది.

పదిరోజులుగా కుత్బుల్లాపూర్ సర్కిల్‌పరిధిలోని ఐడీపీఎల్ చౌరస్తాలో ఉన్న బస్టాండ్‌లో ఓ వృద్ధుడు అచేతనంగా పడి ఉన్నాడు. రోజూ అక్కడే బస్సు ఎక్కే బాలానగర్‌కు చెందిన ఎల్ఐసీ ఉద్యోగి జ్యోతికి అతనిపై జాలేసింది. వృద్ధుడి వివరాల కోసం స్థానికులతో కలిసి ప్రయత్నించింది. తనపేరు నారాయణ అని, కన్న కొడుకులే తీసుకొవచ్చి బస్టాండ్ లో వదిలేశారని మాత్రమే చెప్పాడు. మిగతా కుటుంబ వివరాలు చెప్పడానికి నిరాకరించాడు. తనకు పరిచస్తురాలైన శ్రీదేవి దుండిగల్ సమీపంలో 'పల్లవి' వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న విషయం జ్యోతికి స్ఫురణకు వచింది. ఆదివారం సాయంత్రం ఆమెకు సమాచారమందించింది.

వెంటనే స్పందించిన శ్రీదేవి సోమవారం ఉదయం తమ ఆశ్రమ సిబ్బందితో జీడిమెట్ల పోలీసుస్టేషన్ చేరుకుని అతడిని ఆశ్రమానికి తీసుకువెళ్తున్నట్లు తెలిపింది. వారి సహాయాన్నిఅభినందించిన జీడిమెట్ల ఎస్సై ప్రవీందర్‌రావు అతడిని ఆశ్రమానికి చేర్చడానికి ప్రయాణ ఏర్పాట్లు చేశాడు. నిలబడే శక్తికూడా లేని అతడిని శ్రీదేవి ఆటోలో ఆశ్రమానికి తీసుకెళ్లింది. వృద్ధులకు సేవలందిస్తున్న శ్రీదేవిని స్థానికులు అభినందించారు. అనాథలను అక్కున చేర్చుకుని సేవలందిస్తున్న శ్రీదేవికి, సాటివారి దయనీయ స్థితిపై జాలిపడి ఆశ్రమానికి దారి చూపిన జ్యోతికి 'ఆన్‌లైన్' హ్యాట్సాఫ్ చెబుతోంది.

No comments:

Post a Comment